శ్రీ రాముడు లోకానికి ఆదర్శం
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు
ప్రజా గొంతుక న్యూస్,(మార్చి 22) సూర్యాపేట: శ్రీరాముడు లోకానికి ఆదర్శమని ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ లో గల శ్రీ వేదాంత బజన మందిరములో నిర్వహిస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రామాయణం పై ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. రాముడు లోకమందరికి ఆదర్శమని అన్నారు. మనసుని అదుపులో పెట్టుకొని రాముడు తాను పిత్రువాక్య పరిపాలుడై తన తమ్ముళ్ళు లక్ష్మణున్ని భరతుని ప్రేమిస్తూ, లోకానికి ఆదర్శంగా నిలిచాడని ఆయన అన్నారు. అధికారము చేతికొచ్చినప్పటికీ కూడా నువ్వు అడవుల్లోకి వెళ్లాలని కైకేయి చెప్పగానే వెంటనే ఎదురు మాట్లాడకుండా రాముడు సీతాదేవితో కలిసి అడవులకు వెళ్లాడని, అంతటి గొప్పవాడు కాబట్టే రామచంద్ర మూర్తిని మనం ఈరోజు కూడా కొలుస్తున్నామని ఆయన అన్నారు. మానవుడు తన కోరికల్ని అదుపులో పెట్టుకోవాలని, కోరికలే వినాశనానికి మూలం అని, ఆయన అన్నారు. ఈ కోరికల వల్లనే సమస్త లోకమంతా కూడా నాశనం అవుతుందని అందుకే కోరికలను అదుపులో పెట్టుకున్న వాడే జ్ఞాని అవుతాడని ఆయన చెప్పారు. మనం చేసే మంచి పనుల వల్లనే భగవంతుడు మనల్ని రక్షిస్తాడని, భగవంతుని నామస్మరణ చాలా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావును సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, ఆలయ అర్చకులు ధరూరి సింగరాచార్యులు, రాఘవాచార్యులు, సోమ సుమన్, షీలా శంకర్, తదితరులు పాల్గొన్నారు











