సుల్తానాబాద్లో హోటళ్లపై సివిల్ సప్లై దాడులు
– ఐదుగురిపై కేసులు, 8 సిలిండర్లు స్వాధీనం
ప్రజా గొంతుక సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న పలు హోటళ్లపై సివిల్ సప్లై శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలలో అనేక హోటళ్లలో నిబంధనలు ఉల్లంఘిస్తూ గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఐదుగురిపై కేసులు నమోదు చేసి, మొత్తం 8 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గృహ అవసరాలకు మాత్రమే కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని, సరైన విధంగా వాణిజ్య సిలిండర్లను వినియోగించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డీటీవో మహేష్, డీడీవో రవీందర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఉండేందుకు పట్టణంలోని అన్ని హోటళ్లపై క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












