హాలియా మున్సిపాలిటీలో ఘనంగా ప్రారంభమైన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణ కార్యక్రమం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:06
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణ కార్యక్రమం హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఘనంగా ప్రారంభించబడింది.
ఈ కార్యక్రమాన్ని హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి , వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ , మరియు మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా 1వ వార్డు పరిధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆర్.పి లు, మరియు మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి పట్టణ అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం సూచించిన పలు ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా క్రింది అంశాలపై విస్తృత కార్యక్రమాలు చేపట్టబడతాయి.
పారిశుద్ధ్య నిర్వహణ: పట్టణంలోని అన్ని వార్డుల్లో నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం.
ప్లాస్టిక్ నియంత్రణ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై కఠిన చర్యలు తీసుకోవడం మరియు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.
చెత్త వర్గీకరణ: తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను వేగవంతం చేయడం.
మౌలిక సదుపాయాల అభివృద్ధి: డ్రైనేజీల పూడికతీత, కాలువల శుభ్రత మరియు పట్టణ శుభ్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టడం.
ఈ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక 06.03.2026 నుండి 12.06.2026 వరకు కొనసాగుతుందని, ఈ నిర్ణీత కాలంలో హాలియా పట్టణాన్ని ఆదర్శవంతమైన మరియు పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా భాగస్వాములై మున్సిపాలిటీకి పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, ఆర్.పి లు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.












