కొత్తపల్లి రైతు వేదికలో పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం
మున్సిపల్ కమిషనర్,
హాలియా మున్సిపాలిటీ,
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:05
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు, హాలియా మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కొత్తపల్లి రైతు వేదికలో పోలింగ్ అధికారులు ( పి ఓ లు) మరియు సహాయ పోలింగ్ అధికారులు (ఏ పి ఓ లు) కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధిత పి ఓ లు, ఏ పి ఓ లు, జోనల్ అధికారులు, టి.ఓ.టి ( టి ఓ టి ఎస్)లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పోలింగ్ రోజున చేపట్టవలసిన విధులు, ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ స్టేషన్ నిర్వహణ, బాధ్యతలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా వివరించారు.
అదేవిధంగా, జి.రమేష్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఈ కార్యక్రమానికి హాజరై, పోలింగ్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా విధులు నిర్వర్తించాలని పోలింగ్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇక, జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన సూచనల మేరకు, ప్రతి పోలింగ్ అధికారి ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ స్టేషన్లో క్రమశిక్షణ పాటించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేయబడింది.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన అవగాహన కలిగిందని అధికారులు తెలిపారు.












