సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో 'పార్కింగ్' పతనం!
రోగుల పాట్లు.. సెక్యూరిటీ సిబ్బంది 'అడివి' చట్టం!
అస్తవ్యస్తంగా వాహనాల నిలిపివేత.. పట్టించుకోని ఉన్నతాధికారులు
ప్రజా గొంతుక న్యూస్, జనవరి 21 కొత్తగూడెం:
సింగరేణి సంస్థకు మణిహారంగా భావించే కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రి ప్రస్తుతం రోగుల పాలిట 'నరకప్రాయం'గా మారింది. మెరుగైన వైద్యం కోసం వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలో కనీస పార్కింగ్ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. యాజమాన్యం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఉన్న అస్తవ్యస్త నిర్వహణ వల్ల రోగుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
సెక్యూరిటీ సిబ్బంది 'పక్షపాత' ధోరణి:
ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, 'తమకు నచ్చిన వారికి ఒక నీతి.. సామాన్యులకు ఒక నీతి' అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పరిచయస్తుల వాహనాలను దర్జాగా లోపలికి అనుమతిస్తూ, సామాన్య కార్మికులను మాత్రం అస్తవ్యస్తంగా ఉన్న పార్కింగ్ స్థలంలోకి నెట్టేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ప్రదర్శిస్తున్న ఈ అనుచిత సౌజన్యం వల్ల సామాన్య రోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ద్విచక్ర వాహనాల దిగ్బంధం.. కార్ల తంటాలు:
పార్కింగ్ స్థలంలో క్రమశిక్షణ కరువైంది. ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా నిలపడంతో, అత్యవసర స్థితిలో వచ్చే కార్లు లోపలికి వెళ్లడానికి, పార్కింగ్ చేయడానికి స్థలం లేక వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీల్ చైర్లు, స్ట్రెచర్ల మీద వచ్చే రోగులకు ఈ వాహనాల అడ్డంకులు శాపంగా మారాయి. ప్రధాన రహదారి అంతా వాహనాలతో నిండిపోయి, ఆసుపత్రి వాతావరణం కాస్త ట్రాఫిక్ జంక్షన్ను తలపిస్తోంది.
కార్మికుల ఆగ్రహం.. అధికారుల మౌనం:
"రోజూ వందల సంఖ్యలో రోగులు వచ్చే ఆసుపత్రిలో పార్కింగ్ సమస్యను పరిష్కరించకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శనం" అని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహిత ప్రవర్తనను అదుపు చేయాలని, శాశ్వత పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.













